Thursday, April 5, 2018

పొద్దున్నే ఐదున్నరకు సెహ్వాగ్‌ తలుపు కొట్టాడు

 తర్వాత పిలిచి మాట్లాడతా అన్నాను: గంగూలీ
  ‘శ్రీలంకతో ఫైనల్‌ ఓడిపోయిన మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు వీరేంద్ర సెహ్వాగ్‌ నాతో మాట్లాడేందుకు వచ్చాడు. నిద్రమత్తులో లేచి తలుపు తీశాను. ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడతాను అని చెప్పాను’ అని గంగూలీ తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో సౌరభ్‌ గంగూలీ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘2001లో ముక్కోణపు సిరీస్‌ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లాం. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో 121 పరుగుల తేడాతో భారత్‌ ఓడిపోయింది. అనవసరపు షాట్‌కు యత్నించిన సెహ్వాగ్‌ రనౌట్‌ రూపంలో వెనుదిరిగాడు. ఆ తర్వాతి రోజు ఉదయం 5.30 గంటల సమయంలో నా గది తలుపు మోగింది. తిరిగి భారత్‌ వెళ్లే క్రమంలో ఎయిర్‌పోర్టుకు వెళ్లే ముందు నన్ను కలవాలని వచ్చాడు. కానీ, నాకు ఏమో అంత పొద్దున్నే సెహ్వాగ్‌తో మాట్లాడే మూడ్‌ లేదు. దీంతో తర్వాత పిలిచి మాట్లాడతా అని చెప్పాను. ముందు రోజు ఫైనల్లో తాను ఆడిన విధానం పట్ల కెప్టెన్‌ సంతృప్తిగా లేడు.. ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలని వచ్చాడు. కానీ, నేను మాట్లాడలేదు’ అని గంగూలీ అప్పటి సంగతిని గుర్తు చేసుకుని చెప్పాడు.
ఈ ఏడాది ఐపీఎల్‌లో సెహ్వాగ్‌ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు మెంటార్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. శనివారం ఐపీఎల్‌ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. 

No comments:

Post a Comment