Saturday, January 8, 2011

గంభీర్‌ టాప్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-4 టోర్నమెంట్‌కు కౌంట్‌డౌన్‌ క్రీడాకారుల వేలంతో శనివారం నాడిక్కడ ప్రారంభమైంది. ఐపిఎల్‌ కమిషనర్‌ చిరాయు అమిన్‌ అధ్యక్షతన తొలి రోజు జరిగిన వేలంలో భారత జట్టు ఓపెనర్‌ గౌతం గంభీర్‌ అగ్ర భాగాన నిలిచాడు. అతడ్ని కొల్‌కతా నైట్‌రైడర్స్‌ రికార్డు ధర 2.4 మిలియన్‌ డాలర్లకు 2.4 మిలియన్‌ డాలర్లకు, అంటే రు.11.04 కోట్లకు కొనుగోలు చేసింది.క్రికెటర్లు రెండు మిలియన్ల ధర పలికారు. కెవిన్‌ పీటర్సన్‌, ఆండ్రూ ఫ్లింటాఫ్‌ కంటే గంభీర్‌ ఎక్కువ ధర పలికాడు. కొల్‌కతా నైట్‌ రైడర్స్‌ సహ యజమాని, బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్‌ ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. గంభీర్‌తో పాటు హార్డ్‌హిట్టింగ్‌ ఆల్‌రౌండర్లు యూసుఫ్‌ పఠాన్‌(రు.9.66 కోట్లు), జాక్స్‌ కల్లిస్‌(రు.5.06 కోట్లు)ను కొల్‌కతా నైట్‌రైడర్స్‌ ఫ్రాంఛైజర్లు కొనుగోలు చేసారు. గత సీజన్‌లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ కెప్టెన్‌గా ఉన్న గంభీర్‌ మౌలిక ధర రు.92 లక్షల కంటే పన్నెండు రెట్లు అధిక ధర పలికాడు. భారత్‌కు చెందిన యూసుఫ్‌ పఠాన్‌, రోహిత్‌ శర్మ (రెండు మిలియన్లు), రాబిన్‌ ఊతప్ప కూడా రెండు మిలియన్ల మార్క్‌ను దాటారు. భారత జట్టులో స్థానం కోల్పోవడంలో విఫలమవుతున్న ఇర్ఫాన్‌ పఠాన్‌ను ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ తీసుకకుంది. అతడికి ఎవరూ ఊహించని రీతిలో రు.8.74 కోట్ల ధర పలికింది.

బెంగుళూరు జట్టులో జహీర్‌
భారత జట్టులో ప్రధాన స్ట్రైక్‌ బౌలర్‌గా మారిన జహీర్‌ ఖాన్‌ పట్ల ముంబయి ఇండియన్స్‌ ఎందుకు ఆసక్తి వ్యక్తం చెయ్యలేదో అర్థం కాలేదు. అతడ్ని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 900,000 డాలర్లకు కొనుగోలు చేసింది. శ్రీలంక ఓపెనర్‌ తిలకరత్నే దిల్షన్‌కు 650,000 డాలర్ల ధర పలికింది. దక్షిణాఫ్రికా జట్టులో డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌, ఇటీవలి కాలం వరకు ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్‌ వన్‌గా ఉన్న డివిల్లీర్స్‌ను విజయ మాల్యా యాజమాన్యంలోని జట్టు సొంతం చేసుకుంది. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ డేనియల్‌ వెట్టోరీని కూడా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు కొనుగోలు చేసింది. రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు రాస్‌ టేలర్‌ను రు.4.6 కోట్లకు సొంతం చేసుకుంది.కెవిన్‌ పీటర్సన్‌ను డక్కన్‌ ఛార్జర్స్‌ 650,000 డాలర్లకు కొనుగోలు చేసింది. తొలి సీజన్‌లో గరిష్ట ధర పలికిన ఆండ్రూ సైమండ్స్‌ను ముంబయి ఇండియన్స్‌ 850,000 డాలర్లకు కొనుగోలు చేసింది.

కోచ్చి జట్టులో లక్ష్మణ్‌
వివిఎస్‌ లక్ష్మణ్‌, శ్రీశాంత్‌, రుద్రప్రతాప్‌ సింగ్‌ (ఆర్‌పిసింగ్‌), బ్రెండన్‌ మెక్‌కలమ్‌, మహేలా జయవర్ధనేలను కోచ్చి కొనుగోలు చేసింది. మెక్‌కలమ్‌ 475,000 డాలర్లకే అందుబాటులోకి వచ్చాడు. దక్షిణాఫ్రికా కెప్టెన్‌ గ్రీమ్‌ స్మిత్‌ను సహారా పూనే వారియర్స్‌ 500,000 డాలర్లకే కొనుగోలు చేసింది. కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ కెప్టెన్‌ కుమార సంగక్కర, జయవర్ధనే ఈ సారి ఆ జట్టులో ఆడటం లేదు.సంగక్కరను డక్కన్‌ ఛార్జర్స్‌, జయవర్ధనేను కోచ్చి కొనుగోలు చేసాయి. డక్కన్‌ ఛార్జర్స్‌ కెప్టెన్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ పట్ల ఆ జట్టు సానుకూలత వ్యక్తం చెయ్యలేదు. అతడ్ని పూనే వేలం పాడింది. యువ క్రీడాకారుడు సౌరభ్‌ తివారీని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు రు.7.36 కోట్లకు సొంతం ం చేసుకుంది.

No comments:

Post a Comment