Monday, April 11, 2016

ఓ ఐడియా.. ముగ్గుర్ని కాపాడింది!

 అదో నిర్మానుష్య ద్వీపం. చుట్టూ నీరు తప్ప మరేమీ కనిపించదు. అలాంటి విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుపోయారు ముగ్గురు యువకులు. మూడు రోజుల నిరీక్షణ తర్వాత సురక్షితంగా బయటపడ్డారు. ఒక చిన్ని ఆలోచన ఆ ముగ్గురి ప్రాణాలను కాపాడింది. ఇంతకీ ఆ ఆలోచన ఏంటీ..? అసలు ఆ ద్వీపంలో వారెలా చిక్కుకున్నారు..?
ఫెడరేటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ మైక్రోనేషియాలోని పులప్‌ ఐలాండ్‌ నుంచి ముగ్గురు యువకులు పడవలో పర్యటనకు బయలుదేరారు. అయితే దురదృష్టవశాత్తు సముద్రపు అలలకు వారి పడవ బోల్తాపడి మునిగిపోయింది. ముగ్గురూ ఈదుకుంటూ ఫనడిక్‌ అనే ద్వీపానికి చేరుకున్నారు.
ప్రాణాలకు తెగించి ఒడ్డుకైతే చేరారుగానీ.. ఆ దీవి నుంచి వారికి బయటపడే మార్గం కనిపించలేదు. ఎటు చూసినా చెట్టూచేమలు.. నీరే కనిపించింది. నిర్మానుష్యంగా ఉన్న ఆ దీవిలో మూడు రోజులు గడిపారు ఆ యువకులు. మరోవైపు పడవ మునక సమాచారమందుకున్న అమెరికా కోస్టు గార్డు సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. మూడు రోజుల తర్వాత ఆ యువకులకు ఓ ఆలోచన తట్టింది. వెంటనే.. చెట్టు కొమ్మలతో ఇసుకపై H E L P అంటూ పెద్ద పెద్ద అక్షరాలను రాశారు. అటుగా వచ్చిన జపాన్‌ ఎయిర్‌బేస్‌కు చెందిన నేవీ సిబ్బంది ఆ అక్షరాలను గుర్తించారు. వెంటనే సహాయకచర్యలు చేపట్టి.. ఆ యువకులను రక్షించారు. వారు సమయస్ఫూర్తితో హెల్ప్‌ అని రాయడం, లైఫ్‌ జాకెట్లతో అక్కడే నిలబడి వుండడం.. వల్లే మా సహాయం అందుకుని ప్రాణాలతో బయటపడగలిగారు... అని చెప్పారు అధికారులు.

No comments:

Post a Comment