Thursday, February 17, 2011

ఘనంగా ప్రపంచ కప్‌ ప్రారంభోత్సవం

 నలభై ఐదు రోజుల పాటు అభిమానులను ఆనందోత్సాహాల్లో నింపేందుకు క్రికెట్‌ కార్నవాల్‌గా అభివర్ణించతగ్గ ఐసిసి ప్రపంచకప్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. బంగ్లాదేశ్‌ రాజధాని నగరంలోని చారిత్రాత్మకమైన బంగబంధు స్టేడియం ప్రారంభోత్సవ వేడుకలకు వేదికగా నిలిచింది. ఈ మెగా పండుగను బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా ప్రారంభించారు.
 వేలాది మంది ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య ఈ పోటీలు ప్రారంభమయ్యాయని ఆమె ప్రకటించారు. ఈ టోర్నమెంట్‌ను నిర్వహించేందుకు తమ దేశాన్ని ఎంపిక చేసినందుకు ఆమె అంతర్జాతీయ క్రికెట్‌ మండలికి కృతజ్ఞతలు తెలిపారు. బంగ్లాదేశ్‌ సంప్రదాయానికి అనుగుణంగా ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్న 14 దేశాల జట్ల కెప్టెన్లు రిక్షాలో మైదానంలోకి రావడంతో ప్రారంభోత్సవ కార్యక్రమం ఆరంభమైంది. చివరగా బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ వచ్చినపుడు ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో స్వాగతం చెప్పారు. ధోనీకి కూడా వారు పెద్దఎత్తున హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ స్వాగతం పలికారు. 15 సంవత్సరాల తరువాత భారత ఉపఖండంలో ప్రపంచకప్‌ తిరిగివచ్చింది.
 బంగ్లాదేశ్‌లో ఈ మెగా టోర్నమెంట్‌ జరగడం ఇదే ప్రథమం. 1971లో స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన తరువాత ఇంతటి పెద్ద టోర్నమెంట్‌ బంగ్లాదేశ్‌లో జరగడం ఇదే ప్రథమం. ఈ నెల 19న భారత్‌, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరగనున్న ప్రారంభమ్యాచ్‌తో ఈ మెగా టోర్నమెంట్‌ ఆరంభమవుతుంది. తొలి మ్యాచ్‌ను నిర్వహించే అవకాశం తమకు కలగడం పట్ల బంగ్లాదేశ్‌లో క్రికెట్‌ అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. తొలి మ్యాచ్‌లో తమ జట్టు గెలవగలదని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తమ జట్టు కనీసం క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకోగలదని వారు భావిస్తున్నారు.

No comments:

Post a Comment