Wednesday, November 25, 2015

ఆమిర్ ఖాన్ వ్యాఖ్యలతో స్నాప్ డీల్ కంపెనీ సెగ

                       భారత్ లో పెరుగుతున్న అసహనంపై బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆయన వ్యాఖ్యలపై పలు వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. రాజకీయ, సినీ రంగ ప్రముఖుల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. అంతేకాకుండా ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఈ-కామర్స్ కంపెనీ స్నాప్ డీల్ కు ఈ వ్యాఖ్యల సెగ తగిలింది. దేశంలో  చోటుచేసుకుంటున్న అసహనపు ఘటనల నేపథ్యంలో దేశాన్ని విడిచి వెళ్లిపోదామా? అని తన భార్య కిరణ్ రావు అడిగిందని ఆమిర్ చెప్పడం.. తీవ్ర వివాదం రేపిన సంగతి తెలిసిందే.
            ఆయన వ్యాఖ్యలతో ఆగ్రహం చెందిన పలువురు నెటిజన్లు గూగుల్ ప్లే స్టోర్ లో స్నాప్ డీల్ యాప్  పట్ల ప్రతికూల వ్యాఖ్యలు చేశారు. స్నాప్ డీల్ యాప్ కు పెద్ద ఎత్తున పూర్ రేటింగ్ ఇచ్చారు. వెంటనే ఆమిర్ ఖాన్ ను స్నాప్ డీల్ బ్రాండ్ అంబాసిడర్ గా తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ వివాదంపై మొదట మౌనంగా స్నాప్ డీల్ సంస్థ ఎట్టకేలకు బుధవారం పెదవి విప్పింది. ఈ వివాదంతో తమకేమీ సంబంధం లేదని ఆ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది.
            'ఆమిర్ ఖాన్ వ్యక్తిగత పరిధిలో చేసిన వ్యాఖ్యలలో స్నాప్ డీల్ కు ఎలాంటి పాత్ర కానీ, సంబంధం కానీ లేదు. స్నాప్ డీల్ భారత్ కు గర్వకారణమైన సంస్థ. యువ భారతీయులు అత్యంత ప్రేమతో నిర్మించిన ఈ సంస్థ.. సమ్మిళిత డిజిటల్ ఇండియా నిర్మాణంలో దృష్టి పెట్టింది. ప్రతిరోజూ మేం భారత్ లోని వేలాది చిన్న వ్యాపారులు, లక్షలాది వినియోగదారులకు మేలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. భారత్ లో పది లక్షలమంది విజయవంతమైన ఆన్ లైన్ వ్యాపారవేత్తలను తయారుచేయాలన్న పెట్టుకున్న లక్ష్యం దిశగా మేం ముందుకు సాగుతున్నాం' అని స్నాప్ డీల్ తెలిపింది.

No comments:

Post a Comment