Wednesday, November 3, 2010

శ్రీలంక అద్భుత విజయం

ఆంజెలో మాథ్యూస్‌, లాసిత్‌ మలింగ అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. ఆస్ట్రేలియాతో బుధవారం నాడిక్కడ జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో ఈ జోడీ శ్రీలంకకు ఒక వికెట్‌ తేడాతో అనూహ్య విజయం సంపాదించిపెట్టారు. 240 పరుగులు చేయాల్సిన జట్టు 107 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోతే ఏ జట్టయినా విజయంపై ఆశలు వదులు కోవాల్సిందే. అందుకు మాథ్యూస్‌, మలింగ ససేమిరా అన్నారు. తమ జట్టును గెలిపించే బాధ్యతను భుజస్కంథాలపై వేసుకుని చేసి చూపించారు. రణదీవ్‌ రనౌట్‌ అయిన తరువాత అసలు సంచలనం ప్రారం భమైంది. మాథ్యూస్‌తో మలింగ జత కట్టాడు. ఈ జోడీ తొమ్మిదో వికెట్‌కు 132 పరుగులు జోడించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. తమ జట్టును లక్ష్యానికి చేరువకు తీసుకెళ్లారు. 239 పరుగుల వద్ద, అంటే విజయానికి ఒక పరుగు కావాల్సిన దశలో మలింగ రనౌటయ్యాడు. ఈ దశలో చివరి బ్యాట్స్‌మన్‌గా వచ్చిన ముత్తయ్య మురళీధరన్‌ను ఆసీస్‌ అవుట్‌ చేసి ఉంటే మ్యాచ్‌ టైగా ముగిసేది. అయితే ఆసీస్‌ బౌలర్లు, ముఖ్యంగా వాట్సన్‌ ఆ పని చేయలేకపోయాడు. శ్రీలంక 45వ ఓవర్‌లో వాట్సన్‌ బౌలింగ్‌లో రెండో బంతిని మురళీధరన్‌ బౌండరీకి తరలించడంతో శ్రీలంక విజయం సాధించింది. భారత జట్టు చేతిలో అటు వన్డే సిరీస్‌లోనూ, ఇటు టెస్టుల్లోనూ ఓటమి చవిచూసిన ఆసీస్‌ వరుసగా ఆరో ఓటమిని చవిచూసింది. వన్డేల్లో తొమ్మిదో వికెట్‌కు మాథ్యూస్‌, మలింగ 132 పరుగులు జోడించి 27 కిందటి రికార్డును చెరిపివేసారు.

1983 ప్రపంచకప్‌లో కపిల్‌దేవ్‌, సయ్యద్‌ కిర్మాణీ నెలకొల్పిన రికార్డును బ్రేక్‌ చేసారు. ఈ క్రమంలో వన్డేల్లో తొలి అర్ధసెంచరీని మలింగ నమోదు చేసాడు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ మాథ్యూస్‌ 77 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆసీస్‌ విధించిన 240 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక 44.2 ఓవర్లలోనే సాధించింది. అంతకుముందు పెరీరా 46 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీసుకోవడంతో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకన్న ఆసీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. ఆ జట్టులో ఓపెనర్‌ హాడిన్‌ 49, మైక్‌ హస్సే 71, మార్ష్‌ 31 పరుగులు చేసారు. మిగిలిన బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. శ్రీలంక జట్టులో కెప్టెన్‌ సంగక్కర 49 పరుగులు చేసాడు. మలింగ 48 బంతుల్లో 56 పరుగులు చేసి రనౌటయ్యాడు. తొలి వన్డే మ్యాచ్‌ ఆడిన ఆసీస్‌ బౌలర్‌ దోహర్తీ 46 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు.

No comments:

Post a Comment