Wednesday, February 3, 2016

ఓ మిస్డ్‌కాల్.. ప్రేమ..పెళ్లి.. విషాదం!

ఆదిలాబాద్
                   ఓ మిస్డ్‌ కాల్.. వారి మధ్య పరిచయూనికి దారితీసింది. అది ప్రేమగా మారి పెళ్లి దాకా చేరింది. చివరికి ఆ యువతి ప్రాణాన్నే బలితీసుకుంది. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని కొత్త కాలనీకి చెందిన గుమ్ముల స్వరూప (22) బీడీ కార్మికురాలు. గుమ్ముల లక్ష్మి, రాములు మూడో సంతానమైన ఆమె పెద్దగా చదువుకోలేదు. మూడేళ్ల క్రితం ఆమె ఫోన్‌కు ఒక మిస్డ్ కాల్ వచ్చింది. ఎవరు కాల్ చేశారో తెలియక ఆమె తిరిగి కాల్‌ చేసింది. అవతలి వ్యక్తి తన పేరు అశోక్ అని, తాను ఆదిలాబాద్‌కు చెందిన వ్యక్తినని పరిచయం చేసుకున్నాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొన్ని రోజులపాటు ప్రేమలో గడిపారు. అనంతరం అశోక్ పెళ్లికి నిరాకరించడంతో స్వరూప పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.           పోలీసులు, పెద్ద మనుషుల ద్వారా రాజీ కుదుర్చుకుని పెళ్లి చేసుకున్న వారికి 20 రోజుల క్రితమే కూతురు పుట్టింది. ఏమైందో ఏమో తెలియదు కానీ మంగళవారం సాయంత్రం స్వరూప ఆత్మహత్య చేసుకుందని కాలనీవాసులు తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారు. అయితే.. స్వరూప ఆత్మహత్య చేసుకోలేదని, భర్తే చితకబాది బలవంతంగా పురుగుల మందు తాగించాడని ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. అతను హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేస్తున్నాడని అంటున్నారు. ఆదిలాబాద్‌లోని రూరల్ పోలీసులు స్వరూప భర్త అశోక్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment