Wednesday, January 4, 2017

ఒక్క రోజు... రెండు విశేషాలు!

నాగచైతన్య (చైతూ) జీవితంలో జనవరి 29 ఎప్పటికీ గుర్తు పెట్టుకునే రోజుగా మారనుందా? ... అవుననే చెప్పాలేమో! ఎందుకంటే... ఆ రోజు రెండు విశేషాలకు ముహూర్తాలు కుదిరాయని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. చైతూ, సమంతల నిశ్చితార్థం ఈ నెల 29న జరగనుందనే వార్త ఎప్పట్నుంచో షికారు చేస్తోంది. దీనికి తోడు చైతూ హీరోగా బావ దగ్గుబాటి రానా నిర్మించనున్న చిత్రం ప్రారంభోత్సవం కూడా ఆ రోజేనని సమాచారం. ఈ చిత్రంతో కృష్ణ అనే కొత్త దర్శకుడు పరిచయం కానున్నారు. ఈ రెండు వార్తల్నీ అక్కినేని ఫ్యామిలీ అధికారికంగా ప్రకటించలేదు. ఒక తాతయ్య (అక్కినేని నాగేశ్వరరావు) సంస్థలో చైతూ సినిమాలు చేశారు. మరో తాతయ్య (రామానాయుడు) నిర్మాణ సంస్థ సురేశ్‌ ప్రొడక్షన్స్‌లో మాత్రం ఇప్పటివరకూ ఒక్క చిత్రం కూడా చేయలేదు.
నిజానికి, కృష్ణ దర్శకత్వంలో చైతూ హీరోగా మేనమామ సురేశ్‌బాబు ఓ చిత్రం నిర్మించాలనుకున్నారు. ఇప్పుడా చిత్రాన్నే రానా నిర్మించాలను కుంటున్నారట! మరి.. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ బేనర్లోనే నిర్మిస్తారా? రానా తన బేనర్‌కి వేరే పేరు పెట్టుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం చైతూ కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో మాతృసంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. గత ఏడాది రెండు చిత్రాలు ‘ప్రేమమ్‌’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ ద్వారా తెరపై కనిపించిన చైతూ ఈ ఏడాది కూడా లెక్క తగ్గకుండా చూసుకుంటున్నా రనుకోవచ్చు. అన్నట్లు.. ఈ నెల 29న అటు నిశ్చితార్థం.. ఇటు సినిమా ప్రారంభం... రెండూ  జరుగుతాయా? వెయిట్‌ అండ్‌ సీ.

No comments:

Post a Comment