Wednesday, December 28, 2016

పండగ సందడికి సై

హరిదాసుల హడావిడి... బసవన్నల సందడి... కొత్త అల్లుళ్ల హంగామా... బావా  మరదళ్ల చిలిపి వేషాలు.. మన సంస్కృతి, కుటుంబ విలువలకు అద్దం పట్టే సంక్రాంతి పండగ అప్పుడు కనిపించే దృశ్యాలు ఇవే. మా ‘శతమానం భవతి’ కూడా ఇలాంటి దృశ్యాలతో కూడిన అందమైన కుటుంబ కథాచిత్రమే. ఈ పండక్కి థియేటర్లలో సంక్రాంతి శోభ తీసుకొస్తుందంటున్నారు నిర్మాత ‘దిల్‌’ రాజు. శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా సతీశ్‌ వేగేశ్న దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌లు నిర్మించిన సినిమా ‘శతమానం భవతి’.

తాతా మనవళ్ల అనుబంధం, కుటుంబ విలువలతో తెరకెక్కిన ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ‘‘శర్వానంద్‌కి 25వ చిత్రమిది. ఇటీవల విడుదలైన మిక్కి జె.మేయర్‌ స్వరాలకు శ్రోతల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సెన్సార్‌ బోర్డు నుంచి క్లీన్‌ ‘యు’ సర్టిఫికేట్‌ లభించింది’’ అని దర్శకుడు తెలిపారు. ప్రకాశ్‌రాజ్, జయసుధ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమేరా: సమీర్‌రెడ్డి.

No comments:

Post a Comment