హైదరాబాదీ స్టార్ షట్లర్, ఏడో సీడ్ సైనా నెహ్వాల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ను గెలుచుకుంది. ఫైనల్లో అన్సీడెడ్ చైనా ప్లేయర్ సున్ యుపై 11-21, 21-14, 21-19 తేడాతో సైనా విజయం సాధించింది. తొలి గేమ్లో తడబడి సునాయాసంగా తలవంచిన సైనా.. రెండో గేమ్ నుంచి అనూహ్యంగా పుంజుకుంది. రెండో గేమ్ మొదటి నుంచీ దూకుడుగా ఆడిన సైనా.. ఆ గేమ్ను 21-14తో సొంతం చేసుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్ హోరాహోరీగా సాగింది. ఇద్దరు ప్లేయర్స్ నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. చివరికి గంటా పదకొండు నిమిషాలు పోరాడిన సైనా టైటిల్ ఎగరేసుకుపోయింది. సైనా ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలవడం ఇది రెండోసారి. 2014లోనూ ఈ సూపర్ సిరీస్ టైటిల్ను గెలిచింది సైనా. ఆమెకు ఈ ఏడాది ఇదే తొలి టైటిల్ కావడం విశేషం.
ప్రధాని మోదీ, ప్రముఖుల అభినందనలు
సైనా కెరీర్లో ఈ విజయం మరో మైలురాయి అని, 2016 రియో ఒలింపిక్స్కు ఈ విజయం ప్రేరణ కలిగిస్తుందని భారత బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు అఖిలేశ్ దాస్ గుప్తా అన్నారు. సైనా కోచ్ విమల్ కుమార్, సిబ్బందిని అభినందించారు. ‘ఆస్ట్రేలియా ఓపెన్ సిరీస్లో అద్భుత విజయం సాధించిన సైనాకు అభినందనలు. నీ క్రీడా విజయాలతో దేశం యావత్తూ గర్విస్తోంది’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్లో అభినందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్, శిఖర్ధావన్, వీవీఎస్ లక్ష్మణ్, సినీ నటుడు అమితాబ్ బచ్చన్ తదితరులు సైనాకు శుభాకాంక్షలు తెలిపి ఒలింపిక్స్ మంచి ప్రదర్శన కనబరచాలని ఆకాంక్షించారు.
No comments:
Post a Comment