Friday, April 1, 2016

'సావిత్రి' రివ్యూ


 
చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా ఉన్న నారా రోహిత్ ఈ శుక్రవారం 'సావిత్రి' అనే టైటిల్ తో ప్రేక్షకులను పలకరించాడు. 'ప్రేమ ఇష్క్ కాదల్' సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన పవన్ సాదినేని చాలా కాలం గ్యాప్ తర్వాత తెరకెక్కించిన సినిమా 'సావిత్రి'. టైటిల్ తోనే ఆసక్తిని రేకెత్తించిన ఈ లో బడ్జెట్ మూవీ ప్రేక్షకులను ఏమేరకు అలరించిందో చూద్దాం..
కథ : సావిత్రి (నందిత) అనే అమ్మాయికి చిన్నప్పటి నుంచి పెళ్లి అంటే విపరీతమైన ప్రేమ. ఖాళీ దొరికినప్పుడల్లా తన పెళ్లి గురించే కలలు కంటూ ఉంటుంది. పెళ్లి జరిగేందుకు ఏం చేయడానికైనా వెనుకాడని విచిత్ర మనస్తత్వం ఉన్న చలాకీ పిల్ల. తమ కుటుంబానికి సన్నిహితులైన ఓ వ్యక్తితో సావిత్రికి పెళ్లి నిశ్చయం అవుతుంది. నానమ్మ (రమప్రభ)తో కలిసి సంతోషంగా దైవ దర్శనానికి రైల్లో షిర్డీ బయలుదేరుతుంది సావిత్రి. ఆ ప్రయాణంలో తారసపడతాడు రిషి(నారా రోహిత్).

ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన ప్రేమ జంట (మధునందన్, శ్రీముఖి)ను రక్షించే క్రమంలో రిషీ ఆ రైల్లో ప్రయాణించాల్సి వస్తుంది. తొలిచూపులోనే సావిత్రికి ఆకర్షితుడైన రిషి.. ఆమె ప్రేమను గెలుచుకోవాలనుకుంటాడు. అయితే ప్రేమ జంటను రౌడీల నుంచి తప్పించే సమయంలో రిషితోపాటు సావిత్రి కూడా ట్రైన్ మిస్ అవుతుంది.ఇక తిరిగి వాళ్లు రైలును అందుకోవడానికి చేసే ప్రయత్నాలు, ప్రేమజంట పెళ్లి, సావిత్రి  ప్రేమ పొందడానికి రిషి పడే కష్టాలతో మిగిలిన కథ నడుస్తుంది.


ఎవరెలా చేశారంటే..

ఎప్పటికప్పుడు తన పాత్రల్లో వైవిధ్యం ఉండాలని తపనపడే నటుల్లో నారా రోహిత్ ఒకరు. రిషి పాత్రలో తేలికగా ఒదిగిపోయాడు. హీరోయిన్ నందిత అందంగా కనపడింది. తన రోల్ కు పూర్తి న్యాయం చేసిందని చెప్పొచ్చు. పెద్దలకు తెలియకుండా పారిపోయి వచ్చిన జంటగా కామెడీ టచ్ తో మధునందన్, శ్రీముఖిలు అలరించారు. ప్రభాస్ శీను, ఫిష్ వెంకట్, షకలక శంకర్ లు కాసేపు నవ్వించగలిగారు. సీనియర్ నటి రమాప్రభతో సహా మిగిలిన నటీనటులంతా తమ పాత్ర మేరకు రాణించారు.

అయితే దర్శకుడు ఇంతకుముందు తెలిసిన కథనే ఎంచుకోవడంతో పెద్దగా థ్రిల్లింగ్ గా అనిపించదు. తర్వాత ఏం జరుగుతుందనేది ముందే అర్థమైపోతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోరుతోపాటు పాటలు పర్లేదనిపించాయి. కుటుంబ విలువలను చూపించే ప్రయత్నం బావుంది. క్లైమాక్స్ లో డైలాగులు పేలాయి. ఓవరాల్ గా సావిత్రి సాధారణ సినిమానే.

No comments:

Post a Comment