Saturday, October 31, 2015

మరో టైటిల్ కు అడుగు దూరంలో...


 వరుస విజయాలతో దూసుకుపోతున్న సానియా మీర్జా(భారత్)- మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) జోడీ మరో టైటిల్ కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. డబ్యూటీఏ ఫైనల్స్ టోర్నీలో భాగంగా శనివారం జరిగిన సెమీ ఫైనల్లో సానియా జంట  6-4, 6-2 తేడాతో హావో చింగ్ చాన్-యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ) పై విజయం సాధించి ఫైనల్స్ కు చేరింది. తొలి సెట్ లో కాస్త పోరాడిన సానియా ద్వయం.. రెండో సెట్ ను అవలీలగా చేజిక్కించుకుని మరో టైటిల్ వేటకు సన్నద్ధమైంది. ఈ తాజా గెలుపుతో సానియా జోడి తమ వరుస విజయాల సంఖ్యను 21 కు పెంచుకుంది.  
ఎనిమిది నెలల క్రితం మార్టినా హింగిస్‌తో జతకట్టిన సానియా అద్వితీయ ఫలితాలు సాధించింది. హింగిస్‌తో కలిసి ఈ ఏడాది ఏకంగా ఎనిమిది డబుల్స్ టైటిల్స్ సాధించింది. అందులో రెండు గ్రాండ్‌స్లామ్ (వింబుల్డన్, యూఎస్ ఓపెన్) టోర్నమెంట్‌లు కూడా ఉండటం విశేషం. మరో ఒక విజయం సాధిస్తే సానియా-హింగిస్ ఖాతాలో ప్రతిష్టాత్మక డబ్ల్యూటీఏ ఫైనల్స్ టైటిల్ కూడా చేరుతుంది.

నంబర్ వన్ ర్యాంకు పదిలం

డబ్యూటీఏ ఫైనల్స్ టోర్నమెంట్  ఈ సీజన్ ముగింపు టోర్నీ కావడంతో సానియా-హింగిస్ లు మహిళల డబుల్స్ నంబర్ వన్ ర్యాంకింగ్ లో ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. గత ఏప్రిల్ తొలిసారి ప్రపంచ మహిళల డబుల్స్ విభాగంలో నంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకున్న సానియా..  వరుస విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఈ సంవత్సరపు ముగింపు ర్యాంకింగ్స్ లో హింగిస్ తో కలిసి సానియా మీర్జా తన మహిళల డబుల్స్ నంబర్ వన్ ర్యాంకును నిలబెట్టుకుంది.

No comments:

Post a Comment